అమరావతి’ కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు రంగం సిద్దమైంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ మేర కేంద్రం ఆమోదించనుంది. ఇందు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం లో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేయనుంది. ఈ రోజు కేబినెట్ భేటీలో తీర్మానం ఆమోదించి.. అసెంబ్లీలోనూ ఆమోదించటం ద్వారా ఎలాంటి సాంకేతిక – న్యాయ పరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే, అమరావతి పై ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం వేళ జగన్ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత దక్కనుంది. ఈ మేరకు ప్రస్తుత పార్లమెంట్ సమా వేశాల్లోనే ఆమోదం లభించనుంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ రోజు జరిగే కేబినెట్ భేటీ తో పాటుగా చట్టబద్దత కల్పించేలా తీర్మానం చేసేందుకు ఈ నెల 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశ పర్చాలని నిర్ణయించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే న్యాయపరమైన చిక్కులపై కేంద్ర హోం శాఖ అనేక ప్రశ్నలు సంధించింది. వాటికి వివరణ ఇస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుజ జరిగే క్యాబినెట్ భేటీలో స్పష్టమైన తీర్మానం చేయనుంది. ఇదే అంశంపై 28వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానానికి ఆమోదం తెలపనుంది. ఈ బిల్లును కేంద్రానికి పంపనుంది. కేంద్ర న్యాయ శాఖ నుండి వచ్చిన ఆదేశాల మేరకు తీర్మానం పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్మానం తొలుత హోంశాఖకు అక్కడ నుండి న్యాయశాఖకు అక్కడనుండి బిల్లు రూపంలో పార్లమెంటుకు వెళ్ళనుంది. అక్కడ ఆమోదం పొంది రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. అక్కడ రాజముద్ర పడితే అమరావతికి చట్టబద్ధత వస్తుంది. అదే జరిగితే దేశంలో చట్టబద్ధత కలిగిన పార్లమెంట్లో ఆమోదం పొందిన ఏకైక రాజధానిగా అమరావతి నిలుస్తుంది.

ప్రత్యేక సమావేశానికి జగన్ హాజరయ్యేనా..!?

కాగా, అమరావతికి సంబంధించిన కీలక తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అసెంబ్లీ భేటీ కి జగన్ హాజరు పైన పార్టీలో తర్జన భర్జన జరుగుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనతో 2024 ఎన్నికల్లో జగన్ ఎదురు దెబ్బ తిన్నారు. ప్రజలు తమ ఓటింగ్ ద్వారా ఆ ప్రతిపాదన తిరస్కరణకు గురయినట్లు స్పష్టం అవుతోంది. ఆ తరువాత కొన్ని సందర్భాల్లో అమరావతి నిర్మాణంలో అవినీతి పైన ప్రస్తావన చేసిన జగన్.. ఎక్కడా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించ లేదు. గుంటూరు – విజయవాడ జాతీయ రహదారి పైన నిర్మాణం అవసరమైతే మచిలీపట్నం వరకు చేయాలని సూచించారు. అయితే.. ఇప్పుడు ఈ ప్రత్యేక సమావేశానికి హాజరై అమరావతి చట్టబద్దత తీర్మానం కు ఆమోదం తెలపటం ద్వారా రాజకీయంగా జరిగిన నష్టం భర్తీ చేసుకునే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అంతర్గత చర్చల్లో సూచిస్తున్నారు. అయితే, మండలి లోనూ తీర్మానం చేయాలని వైసీపీ కొత్త డిమాండ్ తెర మీదకు తెస్తోంది. జగన్ హాజరు కాకుంటే రాజకీయంగా ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను అయినా సమావేశానికి పంపాలని సూచిస్తున్నట్లు సమాచారం. అయితే, జగన్ తో సహా పార్టీ ఎమ్మెల్యేల హాజరు అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో.. జగన్ తుది నిర్ణయం ఏంటనేది ఈ రోజు జరిగే చర్చల ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *