Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

అండమాన్ సముద్రం మరోసారి రక్తసిక్తమైంది. మెరుగైన జీవితం కోసం ఆశతో బయలుదేరిన వందలాది మంది రోహింగ్యా శరణార్థుల కలలు సముద్రపు అలల మధ్య సమాధి అయ్యాయి. బంగ్లాదేశ్ నుంచి మలేసియాకు వెళ్తున్న ఒక భారీ పడవ ప్రమాదానికి గురవడంతో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ (UNHCR) మరియు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్లోని టేక్నాఫ్ ప్రాంతం నుంచి ఏప్రిల్ 4న బయలుదేరింది.
వాస్తవానికి ఈ రోహింగ్యాలు మయన్మార్ దేశానికి చెందినవారు. 2017లో అక్కడ జరిగిన సైనిక అణిచివేత, మారణహోమం నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి లక్షలాది మంది బంగ్లాదేశ్కు వలస వచ్చారు. వీరంతా బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో ఉన్న శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
అయితే, ఈ శిబిరాల్లో జనాభా పెరిగిపోవడం, కనీస సదుపాయాలు కరువవ్వడం, ఉపాధి లేకపోవడంతో.. వీరంతా అక్రమ మార్గాల్లో మలేసియా వంటి దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏజెంట్ల చేతిలో మోసపోతూ, పాతబడిన పడవల్లో ప్రాణాలకు తెగించి సముద్ర ప్రయాణాలు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఐరాస అధికారులు, అంతర్జాతీయ రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి. అండమాన్ సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే వాతావరణం అనుకూలించకపోవడం, సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. గల్లంతైన వారు సజీవంగా ఉండే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘోర కలికాలంపై ఐరాస ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆగ్నేయాసియా దేశాలు శరణార్థుల ప్రాణాలను కాపాడేందుకు మానవతా దృక్పథంతో స్పందించాలని కోరింది.